Tuesday 29 November 2016

Jamuns or neredu pallu












సీజన్‌లో దొరికే ప్రతి పండు ఆరోగ్యానికి మంచిదని వైద్య, ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వాటిలో నేరేడు పండు ప్రత్యేకత సంతరించుకుంది. ఆయుర్వేదంలో నేరేడు పండును అమర సంజీవనిగా కీర్తిస్తారు. ఈ పండులో ఏ, సీ విటమిన్‌లతో పాటు ఆక్జాలిక్‌ ఆమ్లం ఉండడంతో మంచి రుచి ఇస్తుంది. నేరేడులో విషాన్ని హరించే శక్తి మెండుగా ఉంటుందని పురాణ వైద్యశాస్త్రంలో విస్తృతంగా వాడేవారు. ప్రస్తుతం మార్కెట్‌లో విరివిగా లభిస్తున్నాయి. కిలో రూ.120 నుంచి 150 వరకు ధర పలుకుతోంది.
  • నేరేడు పండు తింటే కడుపులో నులిపురుగులను చంపడంతోపాటు నోటి కేన్సర్‌కు ఔషధంగా పనిచేస్తుంది. 
  •  మధుమేహ వ్యాధిగ్రస్తులకు నేరేడు పండు వరప్రసాదిని. నేరేడు పండు గింజలను కాల్చి పొడి చేసిన తరువాత నీటిలో కలిపి తాగితే చక్కర శాతం అదుపులో ఉంటుంది. 
  •  మూత్రాశయ సమస్యలు ఉన్న వారికి టానిక్‌లా పని చేస్తుంది. డయేరియాను కూడా నివారిస్తుంది. 
  •  నేరేడు ఆకులు కూడా ఔషధ గుణం కలిగి ఉంటాయి. శరీరంలో ఎక్కడైనా గాయమైతే నేరేడు ఆకును గాయంపై ఉంచి కట్టు కడితే నయమైతుంది. 
  •  నోటిపూత, చిగుళ్ళవ్యాధులు, దంతక్షయం ఉన్నా నేరేడు ఆకుల రసాన్ని పుక్కిలిస్తే ఉపశమనం పొందవచ్చు.


గజానునికి ఇష్టమైన పదార్థాలలో వెలగపండ్లుతో పాటుగా నేరుడుపళ్ళు, ఆకులు కూడా ఉన్నవి. నేరేడు చెట్టు ఫలం వల్ల ఉపయోగాలు కోకొల్లలు. నేరుడు చెట్టు పళ్ళే కాదు, కాండపు బెరడుతో సహా ఆయుర్వేద ఔషధాల తయారీలో విరివిగా వినియోగిస్తారు. సంస్కృతంలో దీనిని జంభూ ఫలం అంటారు. మన దేశానికి ప్రాచీన నామం కూడా ‘‘జంభూ ద్వీపం’’ అందుకే హైందవ మంత్రాలలో జంభూ ద్వీపే....భరత వర్షే....భరత ఖండే......అని ఉంటుంది. పేరుకు తగ్గట్టే మన దేశంలో ఇవి అధికంగా పండుతాయి. సిజీజీయం క్యూమిస్‌ దీని శాస్త్రీయ నామం. ఇవి సీజనల్‌ పళ్ళు. సాధారణంగా వేసవి ఆఖరు నుంచి వర్షాకాలం మొదలైన రెండు మూడు వారాల వరకూ ఉంటాయి. ఇవి సున్నితంగా ఉండటం వల్లకింద పడితే పాడవుతాయి. అందువల్ల వీటిని జాగ్రత్తగా కోస్తారు. వీటిలో అల, చిట్టి, జంబో తదితర రకాలు ఉన్నాయి.
రాముని వనవాసంలో: వనవాస సమయంలో రామ లక్ష్మణ సీతలు ఈ పండ్లును తిని కడుపు నింపుకునే వారని రామాయణంలో ప్రస్తావన  ఉంది. అందుకే గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో దీనిని దేవతా వృక్షంగా పూజిస్తారు. పోర్చుగీసు వారు మన దేశానికి వలస వచ్చినప్పుడు వీటి విత్తనాలు తీసుకువెళ్ళి బ్రెజిల్‌కు పరిచయం చేశారని చెబుతారు.ఈ చెట్లు 30 మీటర్ల ఎత్తువరకూ పెరుగుతాయి. వీటిని అక్కడ గిని చెట్లు అంటారు. వందేళ్ల వరకు జీవిస్తాయి. 
తూర్పుగోదావరి జిల్లాలో..
ఏజెన్సీ. గండేపల్లి, మురారి, నందరాడ, దోసకాయలపల్లి, యర్రంపాలెం వంటి పల్లెటూళ్ళ నుంచి బుట్టలు, ప్లాస్టిక్‌ ట్రేలలో వీటిని తీసుకువచ్చి రాజమహేంద్రవరంలో కంబాలచెరువు సమీపంలో ఉన్న రెండు హోల్‌సేల్‌ దుకాణాలలో విక్రయిస్తారు. ఒక్కో దానిలో 30 నుంచి 50 కేజీల వరకూ ఉంటాయి. తోపుడు బండ్లు, సైకిల్‌ వ్యాపారులు హోల్‌సేల్‌గా కొని రిటైల్‌గా కేజీ రూ.120 వరకూ విక్రయిస్తారు. ఇక్కడి  నుంచి విజయవాడ, గుంటూరు, విశాఖ, కాకినాడ, తాడేపల్లిగూడెంలతో పాటు దూర ప్రాంతాలకు, జిల్లాలో పలుప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. 
ఆరోగ్య సంవర్థని 
సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లలో నేరుడు ఒకటి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని. అనారోగ్యాల నివారణి, రోజు ఒక యాపిల్‌ తినండి డాక్టర్‌ దగ్గరకు వెళ్ళవలసిన అవసరం ఉండదు అంటారు. అయితే రోజూ నాలుగు నేరేడు పళ్ళు తిన్నా అంతకన్నా వంద రేట్లు మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. కేంద్ర నాడీ మండలం అతి చురుకుదనాన్ని తగ్గించే గుణం నేరేడు గింజలకు ఉన్నట్టు లక్నోకు చెందిన సెంట్రల్‌ డ్రగ్‌ ఇనిస్టిట్యూట్‌ చెబుతుంది. వర్షాకాలంలో సాధారణంగా జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. వీటిని తగ్గించే గుణం ఆకులకు, పండ్లకు ఉంది, కాల్షియం, ఐరన్‌, పోటాషియం, విటమిన్‌-సి పుష్కలంగా ఉండే ఈ పళ్ళు తింటే వ్యాధి నిరోధకశక్తితో పాటు ఎముకలకు గట్టిదనం కూడా వస్తుంది. నేరేడు ఆకులతో చేసే కషాయం బాక్టీరియల్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. హిమోగ్లోబిన్‌ స్థాయిని పెంచడానికి ఉపయోగపడతాయి. ఎనీమియా వ్యాధికి మంచి ఔషధం. గుండె సంబంధిత వ్యాధులను అడ్డుకునే శక్తి ఉంది. డేయేరియా వ్యాధి తగ్గుముఖం పడుతుంది. కేన్సర్‌ రాకుండా చేయడంలో నేరుడు ముఖ్యపాత్ర వహిస్తాయి. ఆకుల్ని దంచి కషాయంగా కాచి పుక్కిలిస్తే దంతాలు కదలడం, చిగుళ్ళ వాసులు, పుండ్లు వంటివి త్వరగా తగ్గుతాయి. ఆకులను నమిలి నీళ్ళతో పుక్కిలిస్తే నోటి దుర్వాసన తగ్గుతుంది. ఆకు రసంతో పసుపు కలిపి పురుగులు కుట్టిన చోట, దురదలు, సాధారణ దద్దుర్లకు లేపనంగా రాస్తుంటే ఉపశమనం లభిస్తుంది.నేరేడు బెరడుతో చేసే కషాయాన్ని రక్త, జిగట విరేచనాలతో బాధపడే వారికి 30 ఎంఎల్‌ నీళ్ళలో కలిపి తేనె, పంచదార జోడించి ఇస్తే గుణం కనిపిస్తుంది.జిగట విరేచనాలతో బాధపడే వారికి నేరుడు పండ్ల రసాన్ని రెండు నుంచి మూడు చెంచాల చొప్పున ఇవ్వాలి. రోగికి శక్తితో పాటు పేగుల కదలికలు నియంత్రణలో ఉంటాయి. కాలేయం పనితీరు క్రమబద్ధీకరించడానికి శుభ్రపరచడానికి నేరేడు దివ్య ఔషధంలా పని చేస్తుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. నులిపురుగులు నశిస్తాయి. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పని చేస్తాయి. మూత్రం మంట తగ్గడానికి నిమ్మరసం, నేరేడు రసం రెండు చెంచాల చొప్పున నీళ్ళలో కలిపి తీసుకోవాలి.
శరీరంలో వేడిని తగ్గించి....తక్షణ శక్తిని ఇస్తాయి: ఆక్సాలిక్‌ టాన్మిక్‌ ఆమ్లం, విజమిన్లు, క్రోమియం...వంటివి నేరేడులో పుష్కలం. జీర్ణశక్తిని పెంపొందించడమే కాకుండా ఒంట్లోని వేడిని తగ్గిస్తుంది. జ్వరంగా ఉన్నప్పుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే శరీర తాపం తగ్గుతుంది. తక్షణ శక్తిని ఇస్తాయి.
డయాబెటీస్‌ను నియంత్రిస్తుంది :  గుజరాతీ భాషలో ‘‘లంబూ జీవతి ఛే...తో జంబూ ఖావు ఛే...’’ అనే సామేత ఉన్నది. అంటే నేరేడును తింటే చక్కెర వ్యాధి పరార్‌ అని అర్థం. మధుమేహ బాధితులకు వరంలా పనిచేస్తుంది. గ్లైకమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్‌ వ్యాధికి చక్కగా ఉపయోగపడతాయి. గింజల్ని ఎండెబెట్టి పొడిగా చేసుకొని నీటిలో కలుపుకొని తాగితే చక్కెర తగ్గుతుంది.
నెలసరి సమస్యలకు :చాలా మంది స్త్రీలు నెలసరిలో విపరీతమైన నొప్పి వంటి వాటితో బాధ పడతారు. అలాంటి వారు నేరుడు చెక్క కషాయాన్ని 25 రోజుల పాటు 30 ఎంఎల్‌ చొప్పున రోజుకు రెండుసార్లు తీసుకుంటే ఫలితం ఉంటుంది
అల్ల నేరేడు చెట్టు కాడా.. 
నేరేడు పండ్లను కవుల కలాలు వదల్లేదు. తెలుగు సినిమాల్లో నేరేడు చెట్టుపై పలు పాటల పల్లవులతో ప్రయోగాలున్నాయి. ఆడపిల్లల కళ్ళను.. నేరేడుతో పోల్చడం విశేషం.
నేరేడు పండ్ల జ్యూస్‌  ఇలా చేయవచ్చు.. (కావలసినవి ): నేరుడు పండ్ల రసం ఒక కప్పు, రాగి పిండి అరకప్పు, ఖర్జూర పళ్లు 6, రోజ్‌ వాటర్‌ ఒక కప్పు, ఫైవ్‌ స్టార్‌ చాక్లెట్‌ ఒకటి..
తయారు చేసే విధానం : ముందుగా నేరేడు పళ్ళను కడిగి నీటిలో వేసి.. గింజలను తీసి ఒక కప్పు రసాన్ని తీసుకోవాలి. రాగిపిండిని ఒక కప్పు నీటిలో ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. తరువాత గిన్నెలో నాలుగు కప్పుల నీరు పోసి స్టౌపై మరుగుతుండగా రాగిపిండి మిశ్రమాన్ని నెమ్మదిగా  వేసి కలపాలి. 2 నిమిషాల తర్వాత దించాలి. ఖర్జూర పండ్లముక్కలు, ఫైవ్‌ స్టార్‌ చాక్లెట్‌ ముక్కలు, రోజ్‌ వాటర్‌ కలిపి మిక్సీలో వేసి తిప్పి అందులో నేరేడు పండ్ల రసం, రాగి మిశ్రమం వేసి మరోసారి తిప్పితే పోషకాలు గల జంభూ జ్యూస్‌ రెడీ..
పోషకాలు (వంద గ్రాముల్లో)..
తేమ 83.7 గ్రా., పిండి పదార్థం 19 గ్రా, మాంసకృత్తులు 1.3 గ్రా, కొవ్వు 0.1, ఖనిజాలు  0.4 గ్రా, పీచుపదార్థం 0.9 గ్రా, కాల్షియం 15.30 మి.గ్రా, ఇనుము 0.4 గ్రా- 1 మి.గ్రా, సల్ఫర్‌, 13 మి. గ్రా, విటమిన్‌ సి 18 మి.గ్రా, ఫోలిక్‌ యాసిడ్‌ 3 మి.గ్రా, మెగ్నీషియం 35.మి.గ్రా, ఫాస్పరస్‌ 15 మి.గ్రా, సోడియం 28 మీ.గ్రా, శక్తి 82 కేలరీలు ఉంటాయి. నేరేడు పండ్లలో అధిక మోతాదులో సోడియం, పొటాషియం, కాల్ఫియం, ఫాస్పరస్‌, మాంగనీసు, జింక్‌, ఐరన్‌, విటమిన్‌ సీ,ఏలు, రైబోప్లెవిన్‌, నికోటిన్‌ ఆమ్లం, కొలైన్‌, ఫోలిక్‌ యాసిడ్లు  లభిస్తాయి. దానిలోని ఇనుము శరీరంలో ఎర్ర రక్త కణాలను వృద్ధి చేస్తుంది.
డయాబెటీస్‌ నియంత్రణ జాగ్రత్తలు 
నేరుడు వగరుగా ఉండి అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల కొద్దిగా ఉప్పు వేసి తీసుకుంటే రుచితో పాటు వగరు, అరుగుదల సమస్య ఉండదు. భోజనంగంట తర్వాత తీసుకుంటే సులువుగా జీర్ణమవుతుంది. మలబద్దకం సమస్య ఉండదు.


  • ముదిరిన నేరేడు పండ్ల గింజలను శుభ్రపరిచి, నీడన ఎండించి పొడిచేసి, రెండు స్పూన్‌ల మోతాదులో భోజనం తర్వాత రోజూ రెండు పూటలా సేవిస్తే మధుమేహం వల్ల వచ్చే అతి మూత్ర వ్యాధి సమస్య తగ్గిపోతుంది. లేదా ముదిరిన నేరేడు కాండం లోపలి గుజ్జును నీడన ఎండించి కాల్చిన బూడిదెను, ఒక స్పూను మోతాదులో రోజుకు రెండు సార్లు నీటిలో కలిపి సేవించినా ఈ అతిమూత్ర వ్యాధి సమస్య తొలగిపోతుంది.
  •  నేరేడు కాండపు ముక్కలను నీటితో దంచి రసాన్ని తీసి, 5 స్పూన్‌ల రసాన్ని మేక పాలలో కలిపి, ప్రతి రోజూ పరగడుపున వారం రోజుల పాటు సేవిస్తే, విరిగిన ఎముకలు త్వరగా అతుకుతాయి.
  • ప్రసవించిన స్త్రీలు, నేరేడు చెక్కను చిన్న చిన్న ముక్కలుగా చేసి, కషాయంగా కాచి ఆ కషాయంతో జననాంగాన్ని రోజుకు రెండు సార్లు శుభ్రం చేసుకంటే, ఏమైనా దుర్గంధం ఉంటే తొలగిపోతుంది. ఆ భాగంలో పుండ్లు కూడా ఏర్పడవు.
  • నేరేడు చెట్టు లేత ఆకులను ముద్దగా నూరి, రోజూ మూడు పూటలా తీసుకుంటే రక్త విరేచనాలు తగ్గుతాయి.
  •  నేరేడు గింజల కషాయాన్ని తేనెతో సేవిస్తే, వివిధ కారణాల వల్ల కలిగే వాంతులు తగ్గుతాయి. వాంతుల వల్ల ఏప్పడే దప్పిక కూడా పోతుంది.

వేసవిలో లభించే పండ్లలో అల్లనేరేడుకు ప్రత్యేక స్థానం ఉంది. వగరు, తీపి, పులుపు కలగలిసిన రుచితో ఈ పండు నోరూరిస్తుంది దీనిని ఆయుర్వేదంలో ఔషధఫలంగా అభివర్ణిస్తారు. పేగుల్లో ఉండే వెంట్రుకలను సైతం శరీరం నుంచి బయటకు పంపించే శక్తి అల్లనేరేడు సొంతం. వేసవిలో ఎండ నుంచి ఉపశమనం కలిగించి, ఒంటికి చలువ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేసి, ఆకలిని పెంచుతుంది. పైత్యాన్ని, విరోచనాలను తగ్గిస్తుంది. ఈ పండు తింటే ఇంకా ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఒక్కసారి చూద్దాం..
  • సీజన్‌లో ప్రతిరోజూ 10 నుంచి 20 అల్లనేరేడు పళ్లను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
  • వేసవిలో అతిదాహాన్ని అరికడుతుంది. ఒంటికి చలువ చేస్తుంది.
  • మూత్రం రాకా ఇబ్బంది పడే వారికి అల్లనేరుడు ఔషధం లాంటిది. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది. చిన్నచిన్న రాళ్లను కరిగిస్తుంది.
  • కడుపులో నులిపురుగులను నివారిస్తుంది. నోటి, ముత్రాశయ కాన్సర్‌కు టానిక్‌లా పనిచేస్తుంది.
  • చిగుళ్ల వ్యాధులతో భాధపడే వారు ఈచెట్టు బెరడు, ఆకుల రసాన్ని ఆయిల్‌ పుల్లింగ్‌ పుక్కిలిస్తే చాలా మంచింది.
  • కడుపులో ఉన్న ప్రమాదవశాత్తు చేరుకున్న తల వెంట్రుకలు, లోహపు ముక్కలను సైతం కరిగించివేస్తాయి.
  • అల్లనేరేడు కాలేయానికి ఎంతో మేలు చేస్తుంది.
  • అల్లనేరుడు రసంలో కొంచెం చెక్కర కలిపి తాగితే నీళ్ల విరోచనాలు తగ్గుతాయి. పంచాదారకు బదులు తేనె కలిపి తాగాతే ఆరికాళ్లు, ఆరిచేతుల మంటలు, కండ్ల మంటలు తగ్గుతాయి.
  • విత్తనాలు ఎండబెట్టి చేసిన చూర్ణం తీసుకుంటే అతిమూత్ర వ్యాధి అదుపులోకి వస్తుంది.
  • పండ్లే కాదు, నేరేడు ఆకులను ఎండబెట్టి చూర్ణంలో కొంచెం ఉప్పు కలిపి పండ్లు తోముకుంటే చిగుళ్లు గట్టిపడతాయి.
  • అల్లనేరేడు ఆకును గాయంపై కట్టుగా కట్టవచ్చు.
  • అల్లనేరేడు పుల్లతో పండ్లు తోముకుంటే చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. చిగుళ్లు నుంచి రక్తస్రావం తగ్గుతుంది నోటి దుర్వాసన దూరమవుతుంది.
  • లేత ఆకులతో కషాయం కాసి రోజుకు మూడుసార్లు, నాలుగైదు టేబుల్‌ స్పూన్లు తాగితే డయేరియా, మొలలు తగ్గుతాయి.

నేరేడు పండ్లలో ఉండే పోషకాలు గైనమిక్‌ ఇండెక్‌ శాతాన్ని సమతుల్యం చేస్తుంది. జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకి పంపుతుంది. నేరేడుపండ్లలో కాల్షియం, మెగ్నీషియం, పాస్ఫరస్‌, సోడియం, విటమిన్‌ సి, పొలిక్‌ యాసిడ్‌, పీచు ప్రోటీన్లు, కెరోటిన్లు అధికంగా లభిస్తాయి. నేరేడు పండ్లను తీసుకుంటే మధుమేహ వ్యాధి నియంత్రణ, రక్తహీనత, చిగుళ్ల నుంచి రక్తకారడం, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పండ్లు మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకుంటే రక్తంలో చక్కెరస్థాయి అదుపులోకి వస్తుంది. రక్తహీనత సమస్య ఎదుర్కొంటున్న వారు వీటని తీసుకుంటే శరీరానికి మంచిది. శరీరానికి ఇనుము అందుతుంది. నీరసం తగ్గి తక్షణమే శక్తి అందుతుంది. 100 గ్రాముల నేరేడు పండ్లలో 55 శాతం పొటాషియం ఉంటుంది. గుండె, మెదడు, రక్తపోటు ఉన్నవారు ఒక పండు తింటే సరిపోతుంది. అరుగుదల సరిగ్గా లేనప్పుడు కప్పు పెరుగులో నాలుగు చెంచాల నేరేడు పండ్ల రసం కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. నేరేడు పండ్లు తీసుకుంటే రక్తం కారడం, దంతాలు పుచ్చిపోవడం, దుర్వాసన రావడం వంటి సమస్యలు పరిష్కారమవుతాయు. నమిలినప్పుడు పులుపు, వగరు కలపోతగా ఉండి బ్యాక్టీరియాను దూరం చేసి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నేరేడు పండ్లు తింటే విటమిన్లు అంది రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.




No comments:

Post a Comment